Warangalvoice

Ktr Sensational Statement 400 Acres Kancha Gachibowli Land

KTR | కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్‌

  • పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు.

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా పార్టీ తరఫున ఓ మాట ఇస్తున్నాం. మూడేళ్లలో ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ 400 ఎకరాలను హైదరాబాద్‌, తెలంగాణలోనే అతిపెద్ద ఎకో పార్క్‌గా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే మేం స్పష్టం చేస్తున్నాం. ఎవరైనా రేవంత్‌రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి.. రేవంత్‌రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్‌లో ఒక ఇంచు కొనుగోలు చేసినా తిరిగి వెనక్కి తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ ప్రజలకు కానుక..

‘అద్భుతమైన ఎకో పార్క్‌ని హైదరాబాద్‌ ప్రజలకు కానుకగా అందిస్తాం. సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులకు, హైదరాబాద్‌ ప్రజలకు గిఫ్ట్‌గా ఇస్తాం. హైదరాబాద్‌ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. కాంగ్రెస్‌కు ఒక్క సీట్‌ ఇవ్వకుండా గెలిపించారు. 400 ఎకరాలను పొరపాటున ఎవరూ కొనవద్దు. కొంటే నష్టపోతారు. తర్వాత తప్పు పట్టొద్దు. ప్రభుత్వంలోకి వచ్చాక కాదు.. మూడేళ్ల ముందుగానే చెబుతున్నాం. ఈ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ కాంక్షతో పని చేస్తుంది. మేం మాత్రం భవిష్యత్‌ తరాల కోసం ఆలోచిస్తున్నాం. వచ్చే తరాల కోసం ఆలోచించాలని మా నేత కేసీఆర్‌ చెప్పారు. మొన్నటి వరకు ఆ జాగ కోర్టులో ఉంది. ప్రైవేటు వ్యక్తులది కాదు.. ప్రభుత్వానిది కాదని కొట్లాడం. దాంతోనే ఆ ల్యాండ్‌ ప్రజలకు వచ్చింది. మేం కొట్లాడింది రియల్‌ ఎస్టేట్‌ కోసం కాదు కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి.. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు.. గాలి కాలుష్యంతో మాస్క్‌లు వేసుకొని తిరిగి పరిస్థితి ఢిల్లీలో ఉన్నది. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దని.. భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ఎకో పార్క్‌గా మారుస్తాం’ అని స్పష్టం చేశారు.

అందుకే హెచ్‌సీయూకి వెళ్లలేదు..

‘పిల్లలు ఆందోళన చేస్తున్నారని.. వారితో కలవాలని మా నేతలు అంటున్నారు. మేం కూడా వెళ్లాలని ఆలోచించాం.. ఈ దుర్మార్గ కాంగ్రెస్‌ వాళ్లు మేం అడుగు పెట్టగానే.. బీఆర్‌ఎస్‌ వాళ్లు నడిస్తున్నారని అందుకే కొద్దిగా దూరం ఉన్నాం. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే.. హైదరాబాద్‌ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులందరం హెచ్‌సీయూకి వెళ్తాం. ప్రభుత్వం వెనక్కి తగ్గి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రాజ్యసభలో ఫ్లోర్‌ లీడర్‌ సురేశ్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గట్టిగానే మాట్లాడారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని.. హెచ్‌సీయూలో ఆందోళన జరుగుతుందని ప్రస్తావించారు. అట్లాగే హెచ్‌సీయూ విద్యార్థులు ఢిల్లీకి వెళ్తాం అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలంటే ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిపించాం. వారికి మద్దతు ఇస్తున్నాం. లీగల్‌గా కొట్లాడుతున్న విద్యార్థులు, ఎన్‌జీవోలకు మద్దతు ఇస్తాం. ఇది రాజకీయ పోరాటం కాదు.. హైదరాబాద్‌, తెలంగాణ భవిష్యత్‌ కోసం పోరాటం. భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా ఉంటాం’ అని హామీ ఇచ్చారు.

మంత్రులవి పనికి మాలిన మాటలు..

‘మంత్రులు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నరు. ఎక్కడ ఏం ఉందో వివరాలన్నీ ఉన్నయ్‌. ఇది నా రిపోర్ట్‌ కాదు. ఇండిపెండెంట్‌ ఏజెన్సీలు, హెచ్‌సీయూలో ఉండే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్‌లో బోలెడు విషయాలు ఉన్నాయి. భూముల్లో చెరువులు, తాబేళ్లు, నెమళ్లు, జంతువులు ఉన్నయ్‌. ఇవన్నీ హెచ్‌సీయూ,హెచ్‌ఆర్‌సీ వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయి. యుద్ధానికి ఎలాగైతో వెళ్తారో.. మిలటరీ ట్యాంకులు వేసుకొని వెళ్లినట్లుగా దొంగలా బుల్డోజర్లు మోహరించింది. అక్కడ ఉండేది ఒకటి రెండు కాదు జంతువులు. అక్కడ నివసించే వారికి తెలుస్తుంది. రాహుల్‌ గాంధీని చివరగా అడుగుతున్నాం. పెద్దపెద్ద ఉపన్యాసాలు, మాటలు చెబుతుంటారు. మీరు ఆనాడు రోహిత్‌ వేముల విషయంలో.. మీరొస్తే హెచ్‌సీయూలో నిరసనలో పాల్గొనే ప్రజాస్వామిక పరిస్థితు ఆ నాడు కేసీఆర్‌ పాలనలో ఉండేది. మీరు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ? ఆడపిల్లల జుట్లు జుంగడం, బట్టలు చినిగేలా కొట్టడం.. లాఠీఛార్జ్‌లు చేస్తున్నారు?’ అంటూ మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డికి ఇంకా అర్థం కావడం లేదు..

‘హైదరాబాద్‌లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ క్యాంపెయిన్‌ రన్‌ చేశారు ఆ మధ్యలో.. హైదరాబాద్‌లో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్ల ఓవర్లు ఎస్‌ఆర్‌డీపీ కింద.. సేవ్‌ కేబీఆర్‌ అంటూ క్యాంపెయిన్‌ ప్రారంభించారు 700 చెట్లు కొట్టేస్తున్నారని. అక్కడ కేబీఆర్‌ వాకర్స్‌ నిరసన తెలిపితే మేం వెనక్కి తీసుకున్నాం. వాళ్ల కోసమే చేస్తున్నాం.. వాళ్లు వద్దనప్పుడు కేసీఆర్‌ ఆపేయాలని అన్నారు. ప్రజాస్వామిక లక్షణం ఆ పని చేస్తారు. ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెబితే వింటారు. నా అంత గొప్పవారు లేరనుకుంటే రేవంత్‌రెడ్డిలా ఉంటది. రేవంత్‌ అక్కడ ఏం లేవంటారు.. జింకలను పట్టుకొని నెహ్రూ జులాజికల్‌ పార్క్‌లో పెట్టారు. ఇది పార్క్‌ రిపోర్ట్‌లో స్పష్టంగా హెచ్‌సీయూలో జింకలు దొరికాయని.. మరి ముఖ్యమంత్రికి జింకలు కనపడుతయలేవటా? గుంట నక్కలు కనబడుతున్నయటా.. దేశమంతా కోడై కూస్తున్నా.. రేవంత్‌రెడ్డికి అర్థం కావడం లేదు. ఈ మీడియా సమావేశం హైదరాబాద్‌ ప్రజలపై కమిట్‌మెంట్‌ను తెలిపేందుకు.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి తిరిగి వెనక్కి తీసుకుంటామని.. ఆ భూములను ఎకో పార్క్‌గా మారుస్తాం’ అని క్లారిటీ ఇచ్చారు

Ktr Sensational Statement 400 Acres Kancha Gachibowli Land
Ktr Sensational Statement 400 Acres Kancha Gachibowli Land

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *